Telangana Govt: తెలంగాణా మహిళల కోసం కొత్త పథకం.. ఉచితంగా పంపిణీ.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?
తెలంగాణలో(Telangana Govt) నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
- V Santhosh Kumar
- Published on- August 26, 2026 / 09:06 PM IST
Telangana free indiramma sewing machine scheme online application deadline
- ఉచిత ఇందిరమ్మ కుట్టు మిషన్లు
- బీసీ మహిళల ఆన్లైన్ దరఖాస్తు
- సెప్టెంబర్ 15 ఆఖరి తేదీ
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళా సాధికారతను పెంపొందించే క్రమంలో ‘ఇందిరమ్మ కుట్టు మిషన్’ పేరుతో ఒక నూతన ఉచిత పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన బీసీ సామాజికవర్గ మహిళలకు 100 శాతం పూర్తి సబ్సిడీతో, సుమారు రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ సంక్షేమ శాఖ, తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయనున్నారు.
అర్హతలు, అవసరమైన ధృవపత్రాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంత దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షల పరిమితికి లోబడి ఉండాలి. ఆసక్తి గల మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు (Telangana Govt)సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తు విధానం – గడువు:
అర్హత కలిగిన మహిళలు TGOBMMS అధికారిక పోర్టల్ (https://tgobmms.cgg.gov.in/) ద్వారా ఆన్లైన్లో సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఉచిత కుట్టు మిషన్లతో పాటు డ్వాక్రా రుణ సదుపాయాలు, ‘శక్తి బజార్ల’ ద్వారా విక్రయ అవకాశాలు కల్పిస్తున్నందున నిరుద్యోగ బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
