Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్డేట్.. వారికి తక్షణే రూ. లక్ష చెల్లింపు
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. బేస్ మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి..
- Harishth Thanniru
- Published On : March 29, 2025 / 02:11 PM IST
Indiramma housing scheme
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్ డేట్. ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 516 గ్రామాల్లో ఒకేసారి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే పనులు ప్రారంభించాలని, ఇదివరకే ఒకవేళ నిర్మాణాలు ప్రారంభించి బేస్ మెంట్ వరకు పూర్తయిన వారికి రూ.లక్ష తక్షణమే ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం నాలుగు విడతల్లో డబ్బులు చెల్లిస్తుందని, మొదటి విడతలో బేస్ మెంట్ లెవల్ పూర్తయిన తరువాత రూ. లక్ష ఇస్తుందని, ఆ వివరాలను వెంటనే పంపించాలని అధికారులకు సూచించారు. నిర్మాణం చేసి ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని మంత్రి సూచించారు. నిర్మాణం పూర్తికాక, కేవలం గోడలు నిర్మించి కాంట్రాక్టర్ వెళ్లిపోతే.. అలాంటి ఇళ్లను లబ్ధిదారులే నిర్మించుకునేలా అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు.
