Paneer Ban: తెలంగాణాలో పనీర్పై ఏడాది నిషేధం.. హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం హెచ్చరికలు
పనీర్పై(Paneer Ban) రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
- V Santhosh Kumar
- Published on- September 11, 2026 / 09:49 PM IST
Telangana government imposing a one year ban on artificial paneer.
- ఆర్టిఫిషియల్ పనీర్పై పూర్తి నిషేధం
- ఏడాది పాటు ఆదేశాలు అమలు
- ఉల్లంఘిస్తే షాపులు సీజ్ హెచ్చరిక
Paneer Ban: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా మరో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న నకిలీ, కృత్రిమ ఆహార పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్న ఆందోళనల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. పాలతో కాకుండా రసాయనాలు, వంటనూనెలు, ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధం సెప్టెంబర్ 10, 2026 నుంచే తక్షణమే అమల్లోకి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఆంక్షలు:
ఆహార భద్రతా చట్టం ప్రకారం ఈ నకిలీ పనీర్(Paneer Ban)ను ఏ రూపంలోనైనా తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్, నిల్వ ఉంచడం, పంపిణీ లేదా విక్రయించడం వంటి అన్ని రకాల కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆంక్షలు వర్తిస్తాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006లోని సెక్షన్ 30(2)(a) ద్వారా లభించిన అధికారాలను ఉపయోగిస్తూ కమిషనర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ నిషేధ ఉత్తర్వులు ఏడాదితో పాటు అమల్లో ఉంటాయని, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల:
ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807ను అధికారికంగా విడుదల చేసింది. ప్రజలకు దీనిపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, డెయిరీ నిర్వాహకులు తప్పనిసరిగా అసలైన పాలతో చేసిన పనీర్ను మాత్రమే ఉపయోగించాలని, కృత్రిమ పనీర్ వాడితే సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు.
