Fishermen Bike Subsidy : మత్స్యకారులకు అదిరిపోయే శుభవార్త.. కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోన్న సర్కార్
Fishermen Bike Subsidy : తెలంగాణలోని మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. .
- Harish Thanniru
- Published on- July 24, 2026 / 09:39 AM IST
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మత్స్యకారులకు అదిరిపోయే శుభవార్త
- త్వరలో సబ్సిడీపై బజాజ్ ప్లాటినా 110 బైక్ల పంపిణీ
Fishermen Bike Subsidy : తెలంగాణలోని మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. . సబ్సిడీపై అందించే ద్విచక్ర వాహనాల ఎంపికలో కీలక మార్పులు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. మత్స్యకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ప్లాటినా 110 బైక్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ ఏడాదిలోనే సబ్సిడీపై కొత్త బైక్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read : Telangana RTC Employees : తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. చిరకాల కోరిక నెరవేరబోతోంది..
రాష్ట్రంలోని మత్స్యకారులకు సబ్సిడీపై అందించే ద్విచక్ర వాహనాల ఎంపికలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని సమీక్షిస్తూ, మత్స్యకారుల అవసరాలకు మరింత అనువైన బైక్లను అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బజాజ్ ప్లాటినా 110 మోడల్ను సబ్సిడీ బైక్గా ఎంపిక చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చేపల విక్రయం, రవాణా కోసం మత్స్యకారులు ప్రతిరోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి రావడం, అలాగే అధిక బరువును మోయాల్సిన అవసరం ఉండటంతో ఈ మోడల్ అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మత్స్యభవన్లో మత్స్యశాఖ ఉన్నతాధికారులు బజాజ్ ప్లాటినా 110 బైక్ను పరిశీలించారు. వాహనం పనితీరు, మైలేజ్, లోడ్ మోయగల సామర్థ్యం వంటి అంశాలను అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ప్లాటినా 110 ధర సుమారు రూ.70 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉంది. ప్రభుత్వం నిర్ణయించే సబ్సిడీ విధానం ప్రకారం ఈ బైక్లను మత్స్యకారులకు అందించే అవకాశాలపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఈ ఏడాదిలోనే సబ్సిడీపై బజాజ్ ప్లాటినా 110 బైక్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని మత్స్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వేలాది మంది మత్స్యకారులకు రవాణా పరంగా గణనీయమైన ఊరట లభించనుంది.
