‘నా భార్య, పిల్లలని ఏమీ అనొద్దు.. అన్నారంటే.. దెయ్యమై వాళ్లను వదిలిపెట్టను..’ కానిస్టేబుల్ బలవన్మరణం
Hyderabad Constable Commits Suicide : హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్వామి అనే కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Constable swamy commits suicide at DGP office
Hyderabad Constable Commits Suicide : హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని వాష్ రూమ్ లో కానిస్టేబుల్ స్వామి అపస్మారక స్థితిలో కనపించగా.. వెంటనే అధికారులు స్పందించి.. అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే స్వామి మృతి చెందినట్లు నిర్దారించారు. స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని మరణించినట్లు గుర్తించారు. అయితే, స్వామి తన డైరీలో రాసుకున్న నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీజీపీ కార్యాలయం నుంచి ఉస్మానియా మార్చరీకి తరలించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిసింది. స్వామి తన డైరీలో రాసుకున్న నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అందులో.. ‘‘ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నా భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దు. వాళ్లు మంచి వాళ్లు. చనిపోయిన తరువాత దెయ్యం అయినా సరే.. వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా’’ అని రాసిఉంది. అయితే, స్వామి మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ స్వామిది చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం. వాలీబాల్ ప్లేయర్ గా, మెటర్గా స్వామికి డిపార్ట్మెంట్లో పేరుంది. కొండాపూర్ 8వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ స్వామి.. సూసైడ్ నోట్లో కేవలం తప్పు తానే చేశానని రాశాడు. తన తల్లిదండ్రులకు తన తమ్ముళ్లకు ఆ విషయాన్ని స్పష్టంగా రాసిన స్వామి.. తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎక్కడ తన భార్య పిల్లలపైకి వెళ్తారోనని వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని స్వామి తన డైరీ నోట్ లో పేర్కొనట్లు తెలుస్తోంది.
