Ration Cards : తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో సివిల్ సప్లయ్ అధికారులు అర్హులందరికీ రేషన్ బియ్యం అందించే ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజల ఆశలు నెరవేరనున్నాయి. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల నుంచి అధికారులు అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సివిల్ సప్లయ్ శాఖాధికారులకు నివేదిక ఇచ్చారు. దాదాపుగా ఈ కార్యాచరణ పూర్తి కావొచ్చింది. ఈ నివేదికలను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. వ్యవసాయ, రవాణా, ఆదాయపన్ను శాఖల సమాచారం మేరకు అర్హులను ఎంపిక చేయడం గమనార్హం.
ఏడు ఎకరాలకంటే ఎక్కువ భూమి, ఫోర్ వీలర్ వెహికల్స్ కలిగి ఉండడంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. కొన్నేండ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. వీరి ఆకాంక్షలు ఈనెల 26వ తేదీతో తీరనున్నాయి. కార్డులు పొందిన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. పేదల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నది. విద్యార్థులకు స్కాలర్ షిప్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ చికిత్సకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు.. ఇలా పలు పథకాల్లో లబ్ధి పొందేందుకు రేషన్ కార్డులు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి.
కొన్నేళ్లుగా రేషన్ కార్డులు లేక పేదలు పలు పథకాల్లో లబ్ధి పొందేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యలన్నీ కొత్తగా మంజూరు చేస్తున్న రేషన్ కార్డులతో తీరిపోనున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుండడంతో ఆనందం వ్యక్తమవుతోంది.