revenue cadre hike : ఎట్టకేలకు రెవెన్యూ కేడర్ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఉద్యోగుల వివరాలను తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ధరణి రాకతో రద్దయిన తమకు ఇప్పుడు కొత్త డ్యూటీలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు వీఆర్వోలను ప్రభుత్వం ఎలా వాడుకోనుంది?
తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో దూసుకుపోతున్న సర్కార్, ఇప్పుడు ఉద్యోగుల కేడర్ పెంపుపై దృష్టి సారించింది. ఉద్యోగులు పెంపునకు జోన్ల అడ్డంకులు తొలగిపోవడంతో.. జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్కు సిద్ధపడింది. దీనిలో భాగంగా..కొత్త జిల్లాలు, జోన్, మల్టీజోన్ల వారీగా…ఉద్యోగులు పెంపు కోసం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో వీఆర్వోలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
రెవెన్యూశాఖలో అవినీతికి బ్రేక్లు వేసే ఉద్దేశంతో గతేడాది అక్టోబర్ 29న ధరణిని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో వీఆర్వోల దగ్గర నుంచే అవినీతి మొదలవుతుందని భావించి వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసింది. దీంతో 5,485 మంది వీఆర్వోలు తమ విధులను కోల్పోయారు. నాటి నుంచి నేటి వరకు వారి డ్యూటీ ఏంటి, ఎక్కడ పనిచేయాలనేదానిపై క్లారిటీ లేదు. దీంతో డ్యూటీ కోసం ఏడాదికాలంగా వీఆర్వోలు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో…తెలంగాణలోని 10 జిల్లాలు…రెండు జోన్ల పరిధిలో ఉండేవి. 5,6 జోన్ల పరిధిలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరిగేది. కేసీఆర్ పాలనలో 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారాయి. కాలేశ్వరం, యాదాద్రి, రాజన్న, చార్మినార్, జోగులాంబ, భద్రాద్రి, బాసరను కలుపుకుని ఏడు జోన్లు ఏర్పాటు చేసి…దీనిలో కాలేశ్వరం, యాదాద్రి జోనల్ను మల్టీజోన్లుగా గుర్తించింది. కొత్త జిల్లాలలో ఆర్డర్ టు సర్వ్ కింద ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేడర్ స్ట్రెంత్తో ఇంతవరకు ఖాళీగా ఉన్న వీఆర్వోలకు కొత్త బాధ్యతలు కట్టబెట్టనుంది.
ధరణి రాకముందు రెవెన్యూశాఖలో వీఆర్వోల పాత్రే కీలకంగా ఉండేది. గ్రామాలకు సంబంధించిన భూముల వ్యవహారాలు వీఆర్వోల అధీనంలోనే జరిగేవి. భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని…మండల స్థాయిలో కొత్త బాధ్యతలతో సర్దుబాటు చేయనుంది ప్రభుత్వం.
ఇందులో భాగంగా..పట్టా, ప్రభుత్వ భూములపై పట్టు ఉన్న వీఆర్వోలను…తహసీల్దార్ల దగ్గర జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే సగం మంది పోగా, మిగతావారిని రికార్డ్స్ సెక్షన్లో సెక్షన్ అసిస్టెంట్లుగానూ, ఇతర శాఖలలోనూ సర్దుబాటు చేసేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వీఆర్వోల ఎదురుచూపులకు తెరపడనుంది.