హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. జస్ట్ 10 శాతం కడితే చాలు..
Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్తో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
- Harishth Thanniru
- Published On : December 23, 2025 / 07:49 AM IST
Telangana Govt OTS scheme
Telangana Govt OTS scheme : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్తో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను మొండి బకాయిదారులు తమ బకాయిలను చెల్లించేందుకు ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్ స్కీం) పథకంను అమలు చేస్తుంది. ఈ పథకం కింద 90శాతం వడ్డీ రాయితీతో ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మంగళవారం నుంచే ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది.
Also Read : Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
ఓటీఎస్ పై రాష్ట్ర ప్రభుత్వ అనుమతికోసం బల్దియా ఇటీవల లెటర్ రాసింది. ఈ క్రమంలో సోమవారం అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90శాతం మాఫీ చేస్తూ మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. బకాయి పడిన ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. పాత బల్దియాతోపాటు ఇటీవల విలీనమైన 27లోకల్ బాడీలకు కూడా ఈ స్కీమ్ వర్తించనుంది.
నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఈ పథకం అమల్లోకిరానుండగా.. బుధవారానికి శివారు ప్రాంతాల్లో ఓటీఎస్ పథకం అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 5.4లక్షల మందికి ఉపయోగం కలగనున్నట్లు తెలుస్తోంది.
ఏళ్ల నాటినుంచి గత ఆర్థిక సంవత్సరం ( 2025 మార్చి31) వరకు ఉన్న పన్ను బకాయిలకు మాత్రమే ఓటీఎస్ వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను విలువ, జరిమానాల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను కట్టాల్సిన మొండి బకాయిలు చెల్లించాల్సిన వారు 5లక్షల మందికిపైగా ఉన్నారు.
గ్రేటర్లో ఇప్పటికే మూడు సార్లు ఓటీఎస్ అమలు చేశారు. మొదటి సారి 2020లో ఓటీఎస్ ప్రవేశపెట్టారు. అప్పుడు కరోనా టైంలో బల్దియా ఆదాయం తగ్గడంతో ఓటీఎస్ తీసుకువచ్చారు.ఈసారి విలీన ప్రాంతాలతో కలిపి రూ.3వేల కోట్ల టార్టెట్ పెట్టుకున్నారు.
