Telangana Govt: తెలంగాణలో డిజిటల్ విప్లవం.. ఇక ప్రతి గ్రామానికి ఇక సొంత వెబ్సైట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలోని(Telangana Govt) ప్రతి గ్రామాన్ని డిజిటల్ వైపు నడిపిస్తూ, సమగ్ర సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- V Santhosh Kumar
- Published on- August 20, 2026 / 02:05 PM IST
Telangana govt launches individual websites for panchayats under rising telangana 2047
- ప్రభుత్వ డిజిటల్ పంచాయతీల ప్రారంభం
- అన్ని జిల్లాలకు వెబ్సైట్ల విస్తరణ
- గ్రామ సమాచారం వేలిముద్రల్లో లభ్యం
Telangana Govt: తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని డిజిటల్ వైపు నడిపిస్తూ, సమగ్ర సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘రైజింగ్ తెలంగాణ-2047’ లక్ష్యంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న తొలిదశ కింద జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 31 గ్రామ పంచాయతీల ప్రత్యేక వెబ్సైట్లను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు(Telangana Govt) సర్వం సిద్ధం చేశారు.
YS Jagan: డీఎస్సీలో అక్రమాలు జరగడం నిజం.. వాళ్ళు కూడా అంగీకరించారు.. వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
నెలాఖరుకు నియోజకవర్గానికి ఒకటి.. సెప్టెంబర్ నాటికి 12,760 గ్రామాలు;
మొదటి విడత అనంతరం ఈ నెలాఖరు నాటికి శాసనసభ నియోజకవర్గానికి ఒక వెబ్సైట్ చొప్పున అందుబాటులోకి తెస్తారు. అలాగే సెప్టెంబరు మాసాంతం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు సొంత వెబ్సైట్లను అందుబాటులోకి తేనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి వంటి గ్రామ సమాచారం కూడా ఇకపై ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం గ్రామాల్లో కంప్యూటర్లు, ఆప్టికల్ ఫైబర్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పిస్తున్నారు.
సమగ్ర వివరాలు, అభివృద్ధి ప్రణాళికలు ప్రజాక్షేత్రంలో:
ఈ వెబ్సైట్లలో గ్రామం వైశాల్యం, జనాభా, గృహాలు, రేషన్ కార్డులు, పెన్షనర్లు, దివ్యాంగుల వివరాలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా రోడ్లు, తాగునీటి వసతులు, వీధిదీపాలు, స్వయం సహాయక సంఘాల డేటాను పొందుపరుస్తారు. మూడేళ్ల కాలానికి సంబంధించిన గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, వార్షిక బడ్జెట్ అంచనాలు, చేపట్టబోయే పనుల వివరాలను పారదర్శకంగా వెబ్సైట్లలో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ వెల్లడించారు.
