Telangana High Court : అసెంబ్లీ వద్ద రచ్చ.. పోలీసుల ఓవరాక్షన్‌పై హైకోర్టు ఆగ్రహం.. డీజీపీకి కీలక ఆదేశాలు!

Telangana High Court : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై హైకోర్టు స్పందించింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.

Telangana High Court

  • అసెంబ్లీ స్పీకర్ పరిధి… ఇక్కడ పోలీసులకు ఏం పని
  • అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎలా అడ్డుకుంటారు
  • ఈ ఘటనపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

Telangana High Court : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీకి వెళ్లే శాసనసభ్యులను పోలీసులు ఎలా నిలువరిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (Telangana High Court) హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా అసెంబ్లీ వ్యవహారాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించిన అంశాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ‘అసెంబ్లీ స్పీకర్ పరిధిలో పోలీసులకు ఏంటి పని?’ అంటూ సూటిగా ప్రశ్నించింది.

అసెంబ్లీ నిబంధనలకు సంబంధించి ఏదైనా ఉల్లంఘన జరిగితే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులు స్వయంగా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరైన విధానం కాదని పేర్కొంది. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

Read Also : CM Revanth Reddy : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను గుర్తించి, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించింది.

అసెంబ్లీ వద్ద జరిగిన మొత్తం పరిణామాలపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని డీజీపీకి హైకోర్టు గడువు విధించింది. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటన ఇప్పుడు న్యాయస్థానం పరిశీలనలోకి వెళ్లింది. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర, మహిళా ఎమ్మెల్యేలపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడి, అసెంబ్లీ పరిధిలో పోలీసుల జోక్యంపై తదుపరి విచారణలో స్పష్టత రానుంది.