Indiramma houses: గుడ్న్యూస్.. తెలంగాణలో రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు.. ప్రక్రియ షురూ
ఈ నెల 22 నుంచి 30 వరకు అధికారులతో సూపర్ చెక్ కార్యక్రమం ఉంటుంది.
- T Venkateshwarlu
- Published On : April 15, 2025 / 02:52 PM IST
Indiramma Housing Scheme
తెలంగాణలో రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మంగళవారం నుంచే అమలయ్యేలా 23 రోజులపాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. అలాగే, ప్రతి మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెజిటెడ్ అధికారిని దీని కోసం నియమించాలి. అర్హుల లిస్టులపై జిల్లాస్థాయి అధికారులతో విచారణ జరిపించాలి.
ఒకవేళ అర్హుల లిస్టులో ఎవరైనా అనర్హులుంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అర్హుత ఉన్న నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి.
Also Read: విజయసాయిరెడ్డికి షాక్.. విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు
మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలన్న విషయంపై ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు జరుపుతారు. అనంతరం 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీల సూచనలను పరిశీలిస్తారు.
ఈ నెల 22 నుంచి 30 వరకు అధికారులతో సూపర్ చెక్ కార్యక్రమం ఉంటుంది. వచ్చేనెల 1న పంచాయతీ ఆఫీసుల్లో అర్హుల లిస్టును ప్రదర్శిస్తారు. అదే నెల 2, 3, 4 తేదీల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లిస్టులు పరిశీలిస్తారు. మే 5, 6, 7 తేదీల్లో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల మంజూరు ఉంటుంది.
మరోవైపు, గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయింపు జరగలేదు. వీటిపై కూడా అధికారులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. ఎల్ 2లో ఉన్న దరఖాస్తుదారులకు మాత్రమే ఈ ఇళ్లను కేటాయిస్తారు.
