Inter exams: జనవరిలోనే ఇంటర్ పరీక్షలు పెడతారా? ఎందుకంటే?
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అనుగుణంగా సమయం ఉండాలని ఇంటర్ బోర్డ్ అధికారులు యోచిస్తున్నారు.
- T Venkateshwarlu
- Published On : August 27, 2025 / 01:59 PM IST
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలను ఈ సారి జనవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సర్కారుకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
ప్రతి ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2026లో మాత్రం జనవరి మధ్య లేదంటే ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రైవేటు కాలేజీల్లో సిలబస్ను అక్టోబర్, నవంబర్లోపే పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత స్టూడెంట్లతో సిలబస్ను రివిజన్ చేయిస్తున్నారు. అనంతరం నీట్తో పాటు జేఈఈ, ఈఏపీసెట్ వంటి వాటిపై ప్రైవేటు కళాశాలలు దృష్టి పెడుతున్నాయి.
Also Read: మోదీకి ఫోన్ చేసి బెదిరిస్తే 5 గంటల్లో యుద్ధం ఆపేశారు… ట్రంప్ మరో బాంబు.. లేకపోతేనా..
ఈ నేపథ్యంలో ఆయా పోటీ పరీక్షల్లో ర్యాంకులు అధికంగా ప్రైవేటు కాలేజీల విద్యార్థులకే వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ఓ సమీక్ష సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గుర్తుచేశారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అనుగుణంగా సమయం ఉండాలని ఇంటర్ బోర్డ్ అధికారులు యోచిస్తున్నారు. సర్కారు కాలేజీల్లో స్టూడెంట్లకు ఆలస్యంగా సిలబస్ పూర్తిచేయటం వంటి సమస్యలతో పోటీ పరీక్షలపై దృష్టి పెట్టడానికి ఛాన్స్ ఉండడం లేదు.
దీంతో సిలబస్ త్వరగా పూర్తయ్యేలా బోర్డ్ పలు ప్రతిపాదనలు చేసింది. అయితే, ప్రభుత్వ కాలేజీల్లో సిలబస్ అంత త్వరగా పూర్తి కాదన్న వాదనలూ వినపడుతున్నాయి. కాగా, ఈ సారి ఇంటర్ ఫలితాలను గతంలో ఇచ్చినదాని కన్నా ముందే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.
