Ts Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఎప్పుడంటే..
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11గంటలకు ఫలితాలను వెల్లడించారు.
- Harishth Thanniru
- Published On : June 28, 2022 / 11:47 AM IST
Sabitha Indra Reddy
Ts Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11గంటలకు ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 4,65,892 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,94,378 మంది పాస్ అయ్యారు దీంతో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.32శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 76శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. మెదక్ జిల్లా 40శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలు 72.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు- 54.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.
TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా కొనసాగింది. ద్వితీయ సంవత్సరం 67.16 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో అమ్మాయిలు 75.28 శాతం మంది, అబ్బాయిలు 59.21శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 78శాతం ఉత్తీర్ణతతో మేడల్చ్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, మెదక్ జిల్లా 47శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 33 రోజుల వ్యవధిలోనే ప్రథమ, ద్వితీయ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇదిలాఉంటే తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in లలో ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసి, ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్ను ప్రిట్ కూడా చేసుకోవచ్చు.
Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. తొలిరోజు ఎవరికంటే..
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జేఈఈ పరీక్షల కారణంగా పరీక్షల నిర్వహణ ఆలస్యం అయిందని, ప్రశాంత వాతావరణంలో పగఢ్భందిగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా వల్ల గడిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్ లైన్ బోధన చేయడం జరిగిందని, కానీ పూర్తిస్థాయిలో సిలబస్ కాకపోవటంతో 70శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిచటం జరిగిందని అన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. అయితే ఇంటర్, ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి అన్నారు.
