Minister KTR
Minister KTR Criticized : కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తోందన్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దోచిపెడుతోందని చెప్పారు. పెద్ద పెద్ద కార్పొరేట్ల కంపెనీల రూ.12 లక్షల కోట్లు రుణాలను కేంద్రం మాఫీ చేసిందన్నారు. 9లక్షల 19 వేల 479 మంది ఉద్యోగుల కడుపు మీద కొడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వల్ల లక్షా 60 వేల 384 మంది దళితులు, 99 వేల 693 మంది గిరిజనులు, లక్షా 98 వేల 581 మంది ఓబీసీలు ఉద్యోగ అవకాశాలు కోల్పోబోతున్నారని పేర్కొన్నారు. మేము స్టార్టప్ అంటున్నాం.. మీరు ప్యాకప్ అంటున్నారు అని ఎద్దేవా చేశారు. దళితులు, పేదల పట్ల తమ ప్రభుత్వానికి ప్రేమ ఉందన్నారు. మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప బీజేపీ నేతలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కేంద్రం విశాఖ ఉక్కు తక్కులా అమ్మేస్తోందన్నారు. విశాఖ ఉక్కును తక్కు కింద అమ్ముతోంది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో కూడా కేంద్రం ఇదే వైఖరితో ఉందన్నారు. గనులు కేటాయించకుండా సింగరేణిని నెమ్మదిగా ప్రైవేటీకరించే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్ కు గనులు వస్తాయని పేర్కొన్నారు.
దేశంలో ఏం జరుగుతుందో బీజేపీకి బాగా తెలుసన్నారు. చేనేత కార్మికులకు కేంద్రం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. దేశంలో నేతన్నలను ఆదుకుంటోంది తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు.