Telangana Municipal Elections Results 2026
Telangana Municipal Elections : తెలంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు 123 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదిలాఉంటే.. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి మిస్సైంది. దీంతో గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలను అధికారులు పగలగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సరళిని ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ చేస్తుంది. వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో చీఫ్ రాణి కుమిదిని పరిశీలిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతలో పాల్గొంటున్నాయి. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడైంది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరించింది. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.