CV Anand: తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పులు.. 513 మందికి కొత్త భాద్యతలు.. డీజీపీ సీవీ ఆనంద్ స్పెషల్ ఫోకస్
తెలంగాణ పోలీస్ శాఖలో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) తెలిపారు.
- V Santhosh Kumar
- Published on- August 19, 2026 / 09:45 PM IST
Telangana police department restructuring dgp cv anand reallocates 513 personnel
- పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ
- కొత్త నేరాలపై ప్రత్యేక దృష్టి
- 513 మంది సిబ్బంది కేటాయింపు
CV Anand: తెలంగాణ పోలీస్ శాఖలో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand)తెలిపారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సమస్యలుగా ఉండేవి. అయితే ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు పోలీసులకు ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ వంటి ప్రత్యేక విభాగాల నుండి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభిన్న విభాగాలకు రీ-అలోకేట్ చేసినట్లు వెల్లడించారు.
కీలక విభాగాలకు సిబ్బంది కేటాయింపు & శిక్షణ:
సమాజంలో ఎదురవుతున్న నయా సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత రంగానికి అత్యధికంగా 224 మంది సిబ్బందిని కేటాయించారు. అలాగే ఆహార కల్తీ, డ్రగ్ నియంత్రణకు 80 మందిని, విజిల్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు 79 మందిని కేటాయించినట్లు తెలిపారు. ఈ సిబ్బందికి రెండు నెలల అటాచ్మెంట్, విద్యార్హతలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక జరిగిందని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ పోలీస్ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది.
డ్రగ్స్ నియంత్రణ & సైబర్ భద్రతపై ఫోకస్:
యూత్, విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్ అలవాటు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిని అడ్డుకునేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. సైబర్ నేరాల వల్ల గతేడాది భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, వీటి అరికట్టేందుకు ప్రత్యేక విభాగాలను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త విభాగాల్లో బాధ్యతలు స్వీకరించే సిబ్బంది క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫీల్డ్ ఆపరేషన్లకు సరిపడా సిబ్బంది గ్రేహౌండ్స్, ఆక్టోపస్లలో కొనసాగుతారని, మూడు నెలల తర్వాత వీరి పనితీరును సమీక్షిస్తామని వెల్లడించారు.
