×
Ad

Minister Jagadish Reddy : మీ బానిసలు అధికారంలో లేరు- మంత్రి జగదీష్ రెడ్డి

శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని... జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

  • Published On : June 30, 2021 / 08:02 PM IST

Ts Minister Jagadish Reddy

Minister Jagadish Reddy : శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని… జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ జలవిద్యుదుత్పత్తిపై  చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి  కౌంటరిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార దోరణితో వ్యవహరిస్తోందని… మా ఇష్టమోచ్చినట్లు మేము చేస్తాం… మేము చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందని.. ఏపీ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని, అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదని, ఆపే హక్కు ఎవరికీ లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.  శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల‌లో  విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని, తప్పకుండా అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం.. ఎవరో ఆర్డర్టు ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదని మంత్రి చెప్పారు.  కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఆంధ్రప్రదేశ్ దొంగదారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మూడవ వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందాం అని మొదట ప్రతిపాదించింది  తెలంగాణ సీఎం కెసిఆర్ అని…కానీ దానిని తీసుకోవడంలో  పక్క రాష్ట్ర సీఎం విజ్ణత లోపించిందని మంత్రి అన్నారు.

ఇంకా పాతరోజులు కావని.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిందని….ఎవరి చెప్పుచేతుల్లోనూ తెలంగాణ ప్రజలు లేరని, మీ బానిసలు అధికారంలో లేరని జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారని … ఇప్పుడు మీ ఆటలు సాగవని..ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి ఆయన ఏపీ మంత్రులకు హితవు పలికారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రావాలని మంత్రి సూచించారు. ఇరు రాష్ట్రాల రైతాంగానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ సీఎం కెసిఆర్ విజ్ణతతో ఆలోచిస్తారని… మీ జేబులు మేము దోచుకుంటాం.. మా జేబుల వైపు చూడవద్దు అంటే ఇక్కడెవరూ అమాయకులు లేరని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటున్నారని..నీ ఆంధ్రప్రదేశ్  ప్రజల మీదే నీకు సోయి లేదు…ముందు మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండేలా చూడండని జగదీష్ రెడ్డి అన్నారు.