Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.. భీకర గాలులు
Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Harish Thanniru
- Updated on- September 14, 2026 / 09:53 AM IST
Telangana Rain Alert
Telangana Rain Alert : తెలంగాణలోని ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ, రేపు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే, ఉమ్మడి అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, నాంపల్లి, అమీర్ పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్, మణికొండ, రాజేంద్రనగర్ తో పాటు గోల్కొండ, టోలిచౌకి, కాప్రా, అల్వాల్, ఈసీఐఎల్, సైనిక్ పురి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఘట్ కేసర్, కీసర, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రానున్న 24గంటల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
