telangana reports 278 fresh covid19 cases : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 278 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. కొవిడ్తో మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1662కి చేరింది.
రాష్ట్రంలో నిన్న(మార్చి 17,2021) రాత్రి 8 గంటల వరకు 59వేల 905 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,120కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,265 ఉండగా.. వీరిలో 830 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 94,19,677కి చేరింది. కరోనా కేసులపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం(మార్చి 18,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
బాబోయ్.. ఒక్క రోజే 35వేల 871 కొత్త కేసులు, 172 మరణాలు:
భారత్లో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 35వేల 871 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 10లక్షల 63వేల మందికి పరీక్షలు చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం(మార్చి 18,2021) వివరాలు తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 14లక్షల 74వేల 605 కి చేరింది. కొత్తగా 17వేల 741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య కోటి 10లక్షల 63వేల 025కు చేరి.. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.
2.50లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. మంగళవారం(మార్చి 16,2021) రికార్డు స్థాయిలో 188 మరణాలు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 172మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 59వేల 216కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 52వేల 364 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 20లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా అందిన వారి సంఖ్య 3,71,43,255కి చేరింది.