Telangana Corona Numbers : తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే (53 కేసులు) కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. (Telangana Corona Numbers)

Telangana Covid Report

Telangana Corona Numbers : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే (53 కేసులు) కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 72 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో మరో 50 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 637 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 19వేల 681 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 53 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Numbers)

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరటనిస్తున్నాయి. మరణాలు కూడా స్వల్ప హెచ్చుతగ్గులతో 100లోపే వెలుగుచూస్తున్నాయి.

మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,778 కొత్త కేసులొచ్చాయి. ముందురోజు కంటే కాస్త పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 2వేల 542 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 23,087కి తగ్గిపోవడంతో.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 0.05 శాతానికి క్షీణించింది.

ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా..4.24 కోట్ల (98.75 శాతం) మంది కరోనాను జయించారు. 24 గంటల వ్యవధిలో మరో 62 మంది కోవిడ్ తో చనిపోయారు. నేటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 5.16 లక్షలు దాటింది. ఇక నిన్న 30.5 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకూ 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.