Telangana Voter List : తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. 80ఏళ్లు దాటిన ఓటర్లు ఎంతమంది అంటే?
తొలిసారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు.
- Harishth Thanniru
- Published On : November 16, 2023 / 12:02 PM IST
Telangana Voters
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాను బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిసారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది, ట్రాన్స్ జెండర్స్ 2,676 మంది ఉన్నారు. కాగా సర్వీస్ ఓటర్లు మొత్తం 15,406 మంది ఉన్నారు. 2023 జనవరి 5 నాటికి వెయ్యి మంది పురుష ఓటర్లకు 992 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం తుది ఓటర్ల జాబితాలో వెయ్యి మంది పురుషుల ఓటర్లకు 1000.2 మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 31వ తేదీ వరకు ఓటర్ల నమోదు 8.85లక్షలకు పైగా పెరిగింది.
రాష్ట్రంలోని ఓటర్లలో 80 సంవత్సరాలు దాటిని వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 1,89,519 మంది పురుష ఓటర్లు, 2,50,840 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగ ఓటర్లు మొత్తం 5,06,921 మంది ఉన్నారు. వారిలో 2,90,090 మంది పురుషులు , 2,16,815 మంది మహిళలు, 16 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఎన్ఆర్ఐలు 2,944 మంది. వారిలో 2,380 మంది పురుషులు, 563 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఓటరుగా నమోదయ్యారు.
Also Read : CM KCR : గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు
18- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,667 మంది ఉన్నారు. వీరిలో యువకులు 5,70,274 మందికాగా, యువతులు 4,29,273 మంది ఉన్నారు. 120 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45, 37, 256 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు.
