Medaram Jatara Rtc Representative Image (Image Credit To Original Source)
Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర. ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జాతర జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు వస్తారు.
ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు ప్రారంభించింది. మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదం పంపిణీ చేయనుంది. ఇందుకోసం దేవాదాయ శాఖ సహకారం తీసుకోనుంది.
బంగారం ప్రసాదం ప్యాకెట్ తో పాటు దేవతల ఫోటో, బెల్లం, పసుపు, కుంకుమ అందజేస్తారు. ఒక్క ప్యాకెట్ ధర 299 రూపాయలుగా నిర్ణయించారు. ప్రసాదం కావాలనుకునే వారి కోసం బుకింగ్ సౌకర్యం కల్పించారు. www.tgsrtclogistics.co.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో కూడా బుకింగ్ సదుపాయం కల్పించారు ఆర్టీసీ అధికారులు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మేడారాన్ని అభివృద్ధి చేస్తోంది. జాతరను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలనే లక్ష్యంతో మేడారంలో శాశ్వత నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. మేడారానికి కొత్త రూపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
Also Read: ప్రత్యేక యూనివర్సిటీ, ఎయిర్పోర్ట్, నిధులు, పరిశ్రమలు- ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు