Telugu States: ఎర్ర బంగారం.. అన్నదాతకు సిరులు కురిపిస్తున్న మిర్చి!
పండింది మిర్చి కాదు బంగారమే అన్నట్లు మురిసిపోతున్నారు అన్నదాతలు ఈ ఏడాది మిర్చి ధరలు చూసి.
- Naresh Mannam
- Published On : March 23, 2022 / 06:44 AM IST
Telugu States
Telugu States: పండింది మిర్చి కాదు బంగారమే అన్నట్లు మురిసిపోతున్నారు అన్నదాతలు ఈ ఏడాది మిర్చి ధరలు చూసి. అందునా దేశీయ రకం మిర్చి ధరలైతే బంగారంతోనే పోటీపడుతూ ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేస్తున్నాయి. పెరిగిన డిమాండ్ కారణంగా గత కొన్ని రోజులుగా మిర్చి ధరలు క్వింటాల్కు రూ.40 వేలకుపైగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం క్వింటాల్ రూ. 45 వేలు పలికిన దేశీరకం మిర్చి ధర మంగళవారం ఏకంగా రూ.48 వేలకు చేరింది.
Chilly farmers: మిర్చి రైతులకు కన్నీరు తెప్పిస్తున్న వైరస్
గతంలో ఎప్పుడూ మిర్చికి ఈ స్థాయి ధర పలకకపోగా.. ఈ మార్కెట్ చరిత్రలోనే ఇదే ఆల్టైం రికార్డు అని అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో సింగిల్పట్టీ మిర్చికి కూడా రికార్డు స్థాయి ధర పలకడం విశేషం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాల్ రూ.45 వేలు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు వారాలుగా మిర్చి ధర రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 20 రోజులుగా మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతూనే భారీ ధరల వైపు దూసుకెళ్లింది.
బంగారాన్ని మించిపోతున్న ఎండుమిర్చి
అంతర్జాతీయ మార్కెట్లో తెలుగు రాష్ట్రాలలో మిర్చికి భారీ డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడ మార్కెట్లకు వచ్చి మిర్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎనుమాముల మార్కెట్ పరిధిలో దేశీయ రకం సాగు పెరగగా ఇప్పుడు అదే రకం అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్ పెరిగింది. మిగతా తేజా, బేడిగ రకాలతో పాటు దేశీయ మిర్చికి దగ్గరగా ఉండే 341 రకాలకు కూడా భారీ ధరలు పలుకుతున్నాయి.
Summer Crops : వేసవిలో ఆరుతడి పంటల సాగు
మరోవైపు ఈ ఏడాది మిర్చికి ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకాల వర్షాలతో పంట తవ్రంగా దెబ్బతినగా.. వేలాది ఎకరాల్లో మిర్చి పంట నేలపాలైంది. మిగిలిన పంటలో ఎక్కువ శాతం చీడపీడలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఈ ఏడాది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపగా ఉన్న కొద్దిపాటి పంటకి మాత్రం భారీ ధర పలకడం.. అది కూడా ఊహించని విధంగా భారీ ధరలు దక్కడంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు.
