TS Police Constable Exam: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష.. అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాలి
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం టీఎస్ఎల్పీఆర్బి (తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ఏర్పాట్లు పూర్తి చేసింది.
- Harishth Thanniru
- Updated on- August 28, 2022 / 07:33 AM IST
TS Police Constable Exam
TS Police Constable Exam: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం టీఎస్ఎల్పీఆర్బి (తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ఏర్పాట్లు పూర్తి చేసింది. భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని 35 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.
సివిల్ కానిస్టేబుల్ కోటాలో 15,644, రవాణాశాఖ 63, ఆబ్కారీ 614 పోస్టులకు గాను 6.61 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. ఆదివారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమైన ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై నిర్దేశిత ప్రాంతంలో పాస్ పోర్టు సైజు ఫొటో అతికించుకొని రావాలని లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కాలిక్యూలేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలేవీ అనుమతించబోమని, అభ్యర్థులు ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్ తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకురావాలి. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాలు ఉంటే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారు. ఇదిలాఉంటే పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను లోనికి పంపిస్తారు.
