Konda Susmita-TPCC: కొండా సుస్మితకు షాక్.. రేవంత్ పై వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
Konda Susmita-TPCC: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
- V Santhosh Kumar
- Updated on- August 20, 2026 / 12:11 PM IST
Tpcc issues notices to konda sushmitha patel
- టీపీసీసీ కమిటీ సంచలన నోటీసులు
- మూడు రోజుల్లోగా వివరణ ఆదేశం
- జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్
Konda Susmita-TPCC Notices: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల బహిరంగ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, స్వపక్ష నేతలపై బహిరంగ విమర్శలను పార్టీ అధిష్ఠానం అత్యంత తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన నేతలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణ కమిటీ ద్వారా షాక్ ఇచ్చింది.
Also Read: పరకాల బరిలో దిగేది నేనే.. సీఎం అయితే కళ్లు నెత్తికెక్కినయా.. కొండా సుస్మిత సంచలన కామెంట్స్
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేసినందుకు వివరణ కోరుతూ టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. అలాగే వనపర్తి పరిణామాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా సమన్లు జారీ చేసి, మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
మరోవైపు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇతర నాయకులను వ్యక్తిగతంగా దూషించినట్లు వచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది.
