Trs Mahadharna
TRS Mahadharna In Delhi : తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో టీఆర్ఎస్ మంత్రులు కూడా భేటీ అయ్యారు. కానీ ఎలాంటి ఫలితం తేలకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది. అయినా.. కేంద్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోయేసరికి ఆందోళనలను ఢిల్లీకి మార్చింది. ఢిల్లీ వేదికగా పోరు ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం తెలంగాణ భవన్ ప్రాంగంణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టనుంది.
Read More : TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు…మొత్తం మూడు వేల మందికి పైగా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష మొదలుకానుంది. 10 గంటల 45 నిమిషాలకు సీఎం కేసీఆర్ దీక్షా వేదికకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా దీక్ష చేస్తుండడంతో అందరి దృష్టి టీఆర్ఎస్ దీక్షపై నెలకొంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్…యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Read More : Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?
అయితే.. తెలంగాణ వడ్లు కొనేదాక పోరాటం ఆపేది లేదని, కేంద్రం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్… నిరసన దీక్షా వేదికపై నుంచి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు…టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షకు వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లకార్డులు, జెండాలతో తెలంగాణ భవన్, ఢిల్లీ రోడ్లు గులాబీమయమయ్యాయి. బరి గీసి కొట్లాడుతాం, గిరి గీసి ప్రశ్నిస్తాం, మా వడ్లు కొంటవా..? కొనవా..తెలంగాణ రైతుల తెగువ చూపిస్తాం..నూకలు తినమన్నోళ్ల తోక కత్తిరిస్తాము అంటూ ఉన్న పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.