two Cars that collided with police : హైదరాబాద్ నగర శివార్లలోని నిజాంపేట్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఏఎస్ఐ, హోంగార్డును రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి నిజాంపేట్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. దీనిని గమనించిన సృజన్ అనే వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సృజన్ కారు ఢీకొని హోంగార్డుకు గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తుండగా మరో కారు వచ్చి ఏఎస్ఐని ఢీకొట్టింది. దీంతో మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఏఎస్ఐ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు కారణమైన సృజన్, అస్లాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.