Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు .. 13న ప్రధాని రాక?
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గోనున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ పర్యటనలుసైతం ఈ నెలాఖరులో ఉంటాయని ఆ పార్టీనేతలు పేర్కొంటున్నారు.
- Harishth Thanniru
- Published On : February 2, 2023 / 07:51 AM IST
Union Minister Amit Shah
Amit Shah Telangana Tour: తెలంగాణపై బీజేపీ కేంద్ర అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాల తెలంగాణ టూర్ షెడ్యూల్పై క్లారిటీ రాగా.. ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ పై సందిగ్దత నెలకొంది. ఈ నెల 13న రాష్ట్రానికి మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ ఆయన తెలంగాణ టూర్ షెడ్యూల్పై స్పష్టత రాలేదు.
Amith Shah: తెలంగాణపై అమిత్ షా ఫోకస్
ఈ నెలలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గోనున్నారు. అదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరున జేపీ నడ్డాకూడా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణలో ఇద్దరు అగ్రనేతలు పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ కూడా ఈ నెలలో పర్యటిస్తారని తెలుస్తోంది. తొలుత ఈనెల 13న తెలంగాణ కు మోదీ వస్తారని భావించినప్పటికీ వాయిదా పడినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో మోదీ పర్యటన వాయిదా పడిందని, ఈ నెలాఖరులో మోదీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
Amit Shah: వీధి గోడలపై కమలం బొమ్మలు గీసిన కేంద్రమంత్రి అమిత్ షా
ఎన్డీయే ఎనిమిదేళ్ల పాలనను, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా చేస్తోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు కస్టర్లుగా బీజేపీ విభజించింది. జిల్లా స్థాయిలో బహిరంగ సభలు పూర్తయిన తర్వాత క్లస్టర్ స్థాయిలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఈ సభలకు ప్రధాని మోదీ హాజరవుతారని, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నాలుగైదు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
