Asaduddin Owaisi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : October 9, 2023 / 02:20 PM IST
We want a free and fair election Asaduddin Owaisi on 5 states polls
Asaduddin Owaisi on 5 states polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. రాజస్థాన్ లో నవంబర్ 23.. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్ లో మాత్రం రెండు విడతల్లో.. నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. “ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. రాజస్థాన్లో నవంబర్ 23న ఎన్నికలు ఉన్నాయి. రాజస్థాన్లో ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాం, తెలంగాణకు కూడా త్వరలో ప్రకటిస్తాం. మా పార్టీ అభ్యర్థులను తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామ”ని తెలిపారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం: గోవింద్ సింగ్
ఎన్నికలకు తాము సన్నద్దంగా ఉన్నామని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా చెప్పారు. “మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. రాజస్థాన్ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నార”ని ఆయన అన్నారు. కాగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పూర్తి బలంతో పోరాడతామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Also Read: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్
