రాష్ట్రంలో బుధ,గురువారాల్లో తేలికపాటి వర్షాలు
- murthy
- Published On : August 19, 2020 / 07:50 AM IST
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని…. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి రాగల 48 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరాల్లో ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం బలహీనపడింది. అయినప్పటికీ దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
