Dubbak: దుబ్బాక బరిలో నిలుస్తున్న అభ్యర్థులెవరు.. ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరు?
ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి.
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 22, 2023 / 07:06 PM IST
who will contest in Dubbak assembly constituency
Dubbak Candidates: సిట్టింగ్ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేసుకుంటూ అధికార పార్టీ వైఫల్యాలపై విరుచుకుపడుతున్న వ్యక్తి ఒకరు.. అధికార పార్టీ ఎంపీగా దుబ్బాకను అభివృద్ధి చేసిందే తానంటూ మరొకరు.. ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండుగడుతూ ఇంకొకరు.. ఇలా సిద్దిపేట జిల్లా (Siddipet district) దుబ్బాకలో రసవత్తరంగా మారింది రాజకీయం. మరి ఈ త్రిముఖ పోటీలో (triangle fight) బరిలో నిలుస్తున్న అభ్యర్థులెవరు? వారి బలాబలాలేంటి?
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2009లో ఏర్పడింది దుబ్బాక నియోజకవర్గం. ఇక్కడ మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చెరుకు ముత్యంరెడ్డి. ముత్యంరెడ్డిపై 2014, 2018 లో జరిగిన ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. రామలింగారెడ్డి మృతితో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు (Madhavaneni Raghunandan Rao) గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొదట దుబ్బాక, మిర్దొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, తొగుట మండలాలు ఉండేవి. కొత్తగా ఏర్పడ్డ నార్సింగి, రాయపోల్, అక్బర్పేట్ భూంపల్లి మండలాలతో కలిసి ప్రస్తుతం ఎనిమిది మండలాలు ఉన్నాయి.
ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్రావుకు స్థానిక బిజేపీ నేతలతో కొంత పొసగడం లేదు. విపక్ష ఎమ్మెల్యేగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నా.. సొంత పార్టీలో తయారైన అసమ్మతి నేతలను బుజ్జగించలేక ఇబ్బంది పడుతున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వంపై ఒంటికాలితో లేచే రఘునందన్ రావుకు.. నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు దక్కడం లేదు. ఏ కార్యక్రమం అయినా జిల్లా మంత్రి హరీశ్రావు కనుసన్నల్లోనే సాగుతుండటంతో నియోజకవర్గంపై పట్టుచిక్కడం లేదనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారనే విమర్శలు వెంటాడుతున్నాయి. ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో రెబెల్ టీంగా పనిచేసిన నాయిని రాజగోపాల్ (Nayini Rajagopal) తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.
మరోవైపు మాజీ నియోజకవర్గ ఇంచార్జి గిరీశిరెడ్డి, బీజేపీ మాజీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది సంజీవరెడ్డి, ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన బీజేపీ నాయకులు వడ్లరాజు, కానిగంటి శ్రీనివాస్, దౌల్తాబాద్ నాయకులు కుమ్మరి నర్సింహులు బీసీ కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దళితుల కోటా నుంచి తనకు అవకాశం ఇవ్వాలని భిక్షపతి.. మొదటి నుంచీ పార్టీ విధేయుడిగా ఉన్నానని సత్యనారాయణరెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Also Read: మధుయాష్కిని టార్గెట్ చేసిన గోనె ప్రకాష్.. అమెరికాలో అంట్లు తోమారు అంటూ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన నియోజకవర్గంలోని నాయకులను ఎప్పటికప్పుడు కలుస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు వివిధ రకాల ప్యాకేజీలు అందించడాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగిస్తున్నారు ప్రభాకర్రెడ్డి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారాయన. ఇక ఉపఎన్నికల్లో సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ను ఈసారి ఎలాగైనా గెలిపించాలని టార్గెట్గా పెట్టుకున్నారు జిల్లా మంత్రి హరీశ్రావు. దీంతో దుబ్బాకలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంతో పాటు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: షర్మిలకు షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న.. కేటీఆర్తో భేటీ
ఇక.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. మరోసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. పలువురు ఆశావహులు టిక్కెట్ రేసులో ఉన్నప్పటికీ.. తనకే టిక్కెట్ ఖాయమనే ధీమాతో శ్రీనివాస్ రెడ్డి ప్రచారం కూడా మొదలు పెట్టారు. తన తండ్రి , మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను.. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారాయన.
Also Read: రేవంత్రెడ్డికి బలం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న పరిణామాలేంటి?
2020 ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి. సొంత ఇమేజీ ఉన్నా.. పార్టీ ఇమేజీ తగ్గిపోవడంతో దుబ్బాకలో గెలుపుకోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది.
