Uttam Kumar Reddy – Assembly Elections : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తొమ్మిదేళ్లు పూర్తయిన తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల కోసమే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మందుబాబుల వద్ద కమిషన్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వైన్ షాపుల ముందు ఉత్సవాలు జరుపుకోవాలని విమర్శించారు. తెలంగాణలో ఒక్కొక్కరి తలపై రూ.లక్ష అప్పు చేసినందుకు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read..YS Sharmila : కవిత అరెస్ట్ ఎప్పుడు? కారు, కమలం రెండూ ఒక్కటే..!- వైఎస్ షర్మిల
” రైతు రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. పోలీసు వ్యవస్థను సర్వ నాశనం చేసినందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. ల్యాండ్, స్యాండ్, మైన్స్, వైన్స్ కమిషన్ల పేరిట ఎమ్మెల్యేలు దోచుకున్నందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. రాజకీయాలు కమర్షియల్ అయింది వాస్తవం. కమర్షియల్ రాజకీయాలు నేను చేయలేను. అది నా వ్యక్తిగతం అభిప్రాయం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటీ చేస్తా” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.