Harish Rao Thanneeru - Zaheerabad (Photo : Twitter)
Harish Rao Thanneeru – Zaheerabad : జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు జహీరాబాద్ నియోజకవర్గానికి ఉందన్నారు హరీశ్ రావు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలన్నారు. మూడోసారి బీఆర్ఎస్ టికెట్ పొందిన మాణిక్ రావుని గతంలోలా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
”పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మాణిక్ రావు విజయానికి కృషి చేయాలి. పార్టీ నిర్ణయం, సీఎం కేసీఆర్ నిర్ణయంలో మార్పు ఉండదు. విజయం సాధించి జహీరాబాద్ అభివృద్ధిని కొనసాగించాలి. కేసీఆర్ హ్యాట్రిక్ విజయాల్లో జహీరాబాద్ భాగస్వామి అవ్వాలి. మనస్పర్థలు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయండి. ఈ క్రమంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అవకాశం తప్పకుండా వస్తుంది.
రానున్న రోజుల్లో భవిషత్తు ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశాలు వస్తాయి. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుతుంది. కలసికట్టుగా పనిచేద్దాం. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చి గౌరవించింది. ఇంకా ఇతర కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుంది. మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలి” అని మంత్రి హరీశ్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.