Yadagirigutta Rush: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్త జనం.. స్వామిని దర్శించుకున్న 92 వేల మంది భక్తులు
Yadagirigutta Rush: ఆదివారం ఒక్కరోజే యాదగిరి (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న 92 వేల మంది భక్తులు.
- V Santhosh Kumar
- Updated on- June 8, 2026 / 11:47 AM IST
yadagirigutta and basara temples flooded with devotees on weekend
- యాదగిరిగుట్టకు పోటెత్తిన వేలాది భక్తులు.
- ఆలయానికి డెబ్బైమూడు లక్షల ఆదాయం.
- బాసరలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి.
Yadagirigutta Rush: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, బాసర ఆలయాలు భక్తుల సందడితో మునిగితేలాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, ఆదివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Temple) దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దాదాపు 92 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకోగా, ప్రత్యేక దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. వాహనాల రాకతో కొండపైన, కింద పార్కింగ్ స్థలాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.73.75 లక్షల ఆదాయం లభించింది. ఇదే సమయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
*Telangana Rains: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు తెరిచే సమయం దగ్గరపడటంతో నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం చిన్నారుల అక్షరాభ్యాసాలతో కోలాహలంగా మారింది. ఆదివారం నాటి శుభ ముహూర్తం పురస్కరించుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్ద సంఖ్యలో ఆలయానికి తీసుకువచ్చారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం లైన్లలో నిలబడ్డారు. అక్షర శ్రీకార మండపాలు చిన్నారుల వేదమంత్రాల సాక్షిగా అక్షరభ్యాసాలతో సందడిగా మారాయి. చదువుల తల్లి సన్నిధిలో తమ పిల్లలకు మొదటి అక్షరాలు దిద్దించి, ప్రత్యేక పూజల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు.
