YS bhaskar reddy illness : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వివేకా హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈక్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావటంతో జైలు సిబ్బంది డాక్టర్ల సూచననలతో ఆయన్ని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం (మే26,2023) ఉదయం భాస్కర్రెడ్డికి బీపీ పెరగడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే జైలు అధికారులు భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి అనంతరం చంచల్గూడ జైలుకు తిరిగి తీసుకొచ్చారు.అయినా ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడకపోవడంతో మరోసారి శనివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కాగా వివేకా కేసులో తండ్రీ కొడుకులు ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో అనూహ్యంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన అప్పటినుంచి చంచల్ గూడ జైలులోనే ఉంటున్నారు. మరోపక్క అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉంది.
కాగా..సీబీఐ విచారణకు వచ్చిన సమయంలోనే అవినాశ్ తల్లి..భాస్కర్ రెడ్డి భార్య అస్వస్థతకు గురికావటంతో నిన్నటి వరకు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స అందించగా ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో మెరుగైన చికిత్స్ కోసం హైదరాబాద్ తరలించారు. ఈక్రమంలో భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావటం నిమ్స్ ఆస్పత్రికి తరలించటం జరిగింది.