YS Sharmila
YSR Telangana Party President YS Sharmila Reddy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విమర్శలు చేశారు. ఓట్లకోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు, టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పి.. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్నదొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అంటూ షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదు గాని.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడు అంటూ షర్మిల విమర్శించారు.
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే. ఈ డ్రామాలన్ని ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం. మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారనేది వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పండి. నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు.. ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుంది. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు మీరు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.