YS Sharmila: నా మాటలపై హిజ్రాలు బాధపడితే క్షమాపణ కోరుతున్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై గవర్నర్ను కలుస్తా..
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రపతి పాలనపై గవర్నర్ ను కలుస్తానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు.
- Harishth Thanniru
- Published On : February 22, 2023 / 02:34 PM IST
YS Sharmila
YS Sharmila: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రపతి పాలనపై గవర్నర్ ను కలుస్తానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట పవన్ను షర్మిల పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తుందని, పోలీసులు బీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా అంటూ షర్మిల ప్రశ్నించారు.
YS Sharmila: మాపై దాడులు చేసి.. మళ్లీ మా పాదయాత్రనే ఆపేశారు ..
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ గుండాల చేతిలో గాయపడ్డ పవన్ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని, పవన్ పై దాడి చేసిన వారికి పవన్ తల్లి శాపం తగులుతుందని అన్నారు. తన పాదయాత్ర సమయంలోనూ దాడులు చేశారని, నర్సంపేట, మహబూబాబాద్ లలో దాడి చేసి పాదయాత్రను ఆపారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు.. బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుందని పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల
వై.ఎస్. షర్మిలకు వ్యతిరేకంగా వరంగల్ పట్టణంలో హిజ్రాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మహబుబాబాద్ లో తమను కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు. వారి ఆందోళనపై షర్మిల స్పందించారు. నా మాటలపై హిజ్రాలు బాధపడితే ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ కోరుతుందని అన్నారు. వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలను ఆదుకునే బాధ్యత నాది అని షర్మిల అన్నారు.
