తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న 141 మంది విమాన ప్రయాణికులు.. అసలేం జరిగింది?

ప్రమాదం జరగొచ్చనే భయంతో.. ముందుగానే ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు.

Air India Flight Lands Safely (Photo Credit : Google)

Air India Flight Lands Safely : తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఆ విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎయిరిండియా బోయింగ్ విమానం తిరుచ్చి ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిరిండియా విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినడంతో దాదాపు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి ల్యాండింగ్ గేర్ ఓపెన్ కావడంతో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, అంతకు ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదం జరగొచ్చని అంతా భయపడ్డారు. విమానంలో 141 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

మరోవైపు ప్రమాదం జరగొచ్చనే భయంతో.. ముందుగానే ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, ఫైరింజన్లు రెడీ చేశారు. అయితే, ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్.. తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్తోంది. ఇంతలో హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య తలెత్తింది. దీంతో దాదాపు మూడు గంటల పాటు విమానం గాల్లోనే ఉండిపోయింది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పైలెట్లు విమానాన్ని రాత్రి 8 గంటల 14 నిమిషాలకు సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. పైలెట్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు జరిపారు. బెల్లీ ల్యాండింగ్ చేయాలని అధికారులు సూచించారు. చివరికి నార్మల్ ల్యాండింగ్ చేశారు.

ఈ ఘటనను సివిల్ ఏవియేషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలేం జరిగింది? ఎందుకీ సమస్య తలెత్తింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 613 విమానం తిరుచిరాపల్లి నుండి షార్జాకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది.

 

Also Read : పార్సీ అయినప్పటికీ.. రతన్ టాటా భౌతికకాయాన్ని రాబందులకు ఆహారంగా  ఎందుకు పెట్టలేదు?