Pawan Kalyan : ఇంట్లోకి దూరే అవకాశం ఇచ్చారు.. వాలంటీర్లపై మరోసారి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan : వాలంటీర్లు సేకరించిన డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. ఇన్ని వ్యవస్థలు ఉండగా, వాలంటీర్లతో పనేంటి?
- Naveen
- Published On : July 10, 2023 / 09:36 PM IST
Pawan Kalyan
Pawan Kalyan – Volunteers : వాలంటీర్లను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఇప్పటికే తీవ్ర దుమారం రేపాయి. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ, జనసేన మధ్య మాటల మంటలు రాజేశాయి. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, మహిళల అక్రమ రవాణ జరుగుతోందని, దీని వెనుక వాలంటీర్ల హస్తం ఉందని, వాలంటీర్లు రహస్యంగా ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇంకా చల్లారకముందే.. పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.
ఏలూరు నియోజకవర్గ నాయకులు, వీర మహిళలతో సమావేశంలో పవన్ మాట్లాడారు. ”ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రూ.5వేలు ఇచ్చి అందరి ఇళ్లలో దూరే అవకాశం ఇచ్చారు. వాలంటీర్లు సేకరించిన డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. నేను అందరి గురించి చెప్పడం లేదు. ఇన్ని వ్యవస్థలు ఉండగా, వాలంటీర్లతో పనేంటి?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
రూ.5వేలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయించుకుంటుంది ఎవరు?
”వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం యువత జీవితాలను నాశనం చేస్తోంది. రూ.5వేల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు? ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు? వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజలను తీసుకొచ్చే బాధ్యత మీపై వేశారా లేదా? ఆలోచించండి. గ్రామ వాలంటీర్లు, మీ జీవితాల్లో వృద్ధి లేకుండా చేస్తున్నాడు జగన్ ” అని ఘాటుగా ట్వీట్ చేసింది జనసేన పార్టీ.
