మూడు కిలోమీటర్లు నడిచి.. వెంకయ్య నాయుడు గొప్పతనం అదే: జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

  • Publish Date - November 13, 2019 / 09:45 AM IST

దేశంలో ప్రతి చోటా అమ్మభాషలోనే విద్యా బోధన ఉండాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ తప్పు పట్టడంపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్ వేదికగా.. తెలుగు భాష, యాస, ప్రాస, సంస్కృతి, ఉపన్యాసాలంటే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది వెంకయ్య నాయుడు అని, ఆయననను జగన్ విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

మాతృభాష విలువ తెలియని వ్యక్తులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని విమర్శించడం విడ్డూరమని, చిన్నప్పుడు 3 కి.మీ. కాలినడకన వెళ్లి ప్రభుత్వ స్కూలులో చదువుకుని, దేశ ఉప రాష్ట్రపతి స్థాయికి వచ్చిన వెంకయ్యను చూసి సీఎం జగన్‌ నేర్చుకోవాలని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవంటూ వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.