Weather Updates: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం (24-11-2025) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.