వాట్సప్కు షాక్ ఇస్తున్న కంపెనీలు.. సిగ్నల్కు జంప్!
సోషల్ మీడియా సామ్రాజ్యంలో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు.. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సిగ్నల్ యాప్ మాత్రం.. విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకోగా.. 10మిలయన్లకు పైగా డౌన్లోడ్లు చేసుకొని, టాప్ యాప్గా పేరు తెచ్చుకుంది సిగ్నల్ మెసెంజర్ యాప్. వాట్సప్కు పోటీగా మార్కెట్లో క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ యాప్ను ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు, టాప్ బిజినెస్మెన్లు సైతం వాడుతుండగా.. కొన్ని కంపెనీలు సైతం బహిరంగంగానే యాప్కు సపోర్ట్ చేస్తూ.. వాట్సప్కు షాక్ ఇచ్చాయి.
వాట్సప్తో వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఉందనే కారణంతో.. వాట్సప్ లాంటి యాప్లు.. వ్యక్తుల డేటాతో వ్యాపారం చేస్తున్నాయంటూ.. ‘సిగ్నల్’ మెసేజింగ్ యాప్ చాలా బాగుందనే విషయాన్ని “యూజ్ సిగ్నల్” అనే మెసేజ్ ద్వారా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ అపర కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా పరోక్షంగా, సింపుల్గా యూజ్ సిగ్నల్ అంటూ మెసేజ్ ద్వారా సిగ్నల్ యాప్కు సపోర్ట్ చేశారు.
‘సిగ్నల్’ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. 2014లో ప్రారంభమైన ‘సిగ్నల్’ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ సేవలను సిగ్నల్ ఫౌండేషన్ అందిస్తోంది. వాట్సప్ ఫౌండర్ కూడా అయిన బ్రియన్ 2017లో ఫేస్బుక్ తో వేరుపడి 50 మిలియన్ డాలర్లను ‘సిగ్నల్’ లో పెట్టుబడిగా పెట్టి దానిని ఫౌండేషన్గా మార్చారు. మిగతా మెసేజింగ్ యాప్స్తో పోల్చితే ‘సిగ్నల్’ ఓ భిన్నమైన మెసేజింగ్ యాప్గా పనిచేస్తోంది. డొనేషన్లు, గ్రాంట్లపై ఆధారపడుతూ తన ఆపరేషన్స్ కొనసాగిస్తోంది.
కస్టమర్ల ప్రైవసీనే మా ఫిలాసఫీ అంటూ సిగ్నల్ సంస్థ యూజర్ల డేటాకు అత్యంత గోప్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కస్టమర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం రాకుండా కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని, ఇతర సర్వీసు ప్రొవైడర్లలా తాము డేటాను ఇతరులతో పంచుకోమని స్పష్టం చేసింది. ఈ ఒక్క ప్రకటనలతో మనదేశంలో జనవరి 1 నుంచి 1.8 మిలియన్ల సిగ్నల్ డౌన్ లోడ్స్ జరిగాయి. వారంలోగా 14శాతం డౌన్లోడ్లు పెరిగిపోగా.. ఆనంద్ మహీంద్రా వంటివారు కూడా సిగ్నల్ యాప్కు సపోర్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్గా ఫోన్ పే ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ కంపెనీ సీఈఓ సహా ఫోన్పే యాప్ కోసం పనిచేస్తోన్న 1000 మందికి పైగా ఉద్యోగులు తమ మొబైల్ నుండి వాట్సాప్ను తొలగించి తమ పనులన్నింటికీ సిగ్నల్ వాడుతున్నారు. కంపెనీ సీఈఓ సమీర్ నిగం ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు.
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా వాట్సాప్కు బదులు సిగ్నల్ వాడుతున్నారు. ఇది కాకుండా, సంస్థలోని చాలామంది ఉన్నతాధికారులు కూడా వాట్సాప్ను తీసేసి సిగ్నల్కు జంప్ అయ్యారు.
పేమెంట్ యాప్ పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా వాట్సప్ యాప్కు దూరం అవ్వడమే కాక.. వాట్సప్ యాప్ను వాడొద్దని వారి టీమ్కు సలహా ఇచ్చారు.
వాట్సప్ ద్వారా ఫేస్ బుక్ కు రెవిన్యూ జనరేట్ చేయటం అనే అజెండాను ఫేస్ బుక్ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ కమ్యూనికేషన్ను సేఫ్, సెక్యూర్, రిలయబుల్, ఈజీ, కన్వీనెంట్గా మార్చాలని సిగ్నల్ భావిస్తున్నట్లుగా బ్రియన్ ఆక్టన్ వెల్లడించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసి కొత్త రూల్స్ని ప్రకటించడం పెద్ద దుమారం రేపుతోండగా.. వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్పై యూజర్లు అసంతృప్తితో ఉన్నారు.
వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరిస్తే.. యూజర్ల ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, భాష, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్కు తెలుస్తాయి. ఆ వివరాలను ఫేస్బుక్తో పంచుకుంటామని కూడా వాట్సప్ తెలిపింది. ఒకప్పుడు యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఆ ప్రైవసీ విషయంలో కొత్త రూల్స్ తీసుకురావడాన్ని యూజర్లు సహించలేకపోతున్నారు. అందుకే వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ను వాడేందుకు సిద్ధం అవుతున్నారు. వాట్సప్ పాలసీలు అంగీకరించటానికి ఫిబ్రవరి 8 డెడ్ లైన్ కావటంతో ఈలోగా సిగ్నల్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.