సంక్రాంతి సంబరాలు : నాగాయలంకలో పడవల పోటీలు
కృష్ణా : సంక్రాంతి సంబరాలతో పల్లెలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. కోడి పందాలు, పోట్టేలు పోటీలు, బసవన్నల సందడితో పల్లెలంతా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మూడు రోజులపాటు పడవ పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి.
పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పడవల పోటీల్లో భాగంగా మొదటిరోజు కోల పడవల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవగా..కృష్ణా-గుంటూరు జిల్లాలు పోటాపోటీగా తమ సత్తాను చాటాయి. మొదటి విడత పోటీల్లో నాగాయలంకకు చెందిన వెంకటేశ్వరరావు జట్టు రెండో దఫాలో బి.వెంకటేశ్వరరావు జట్టు మూడవ విడత పోటీల్లో నాగాయలంక చెందిన నాగేశ్వరప్రసాద్ జట్టు.. విశ్వనాథపల్లికి చెందిన బి.సుబ్రహ్మణ్యం జట్లు ఫస్ట్ ప్లేజ్ లో నిలిచాయి. ఈ జట్టన్నీ జనవరి జరిగే చివరి పోటీల్లో పాల్గొంటాయని పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కె.జయరామిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పడవల పోటీలకు కృష్ణా జిల్లాలోని నాగాయలంక కేంద్రంగా మారుతుందని, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని జయరామిరెడ్డి తెలిపారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సంప్రదాయ పోటీలను జనవరి 13 ఆదివారం నాడు నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రం వద్ద లెజిస్లేట్ సబార్డినేటర్ మండలి బుద్ధప్రసాద్తో కలిసి పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కె.జయరామిరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో పలు జట్లు పాల్గొని వారి వారి ప్రతిభను చాటుతున్నాయి. నాగాయలంక కేంద్రంగా జరుగుతున్న ఈ పడవల పోటీలను జాతీయ, అంతర్జాతీయ పడవల పోటీలకు నాగాయలంక కేంద్రంగా నిలవాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.