Praveen Sinha..టాప్ ఇంటర్ పోల్ ప్యానల్ కు ఎన్నికైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్
కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా.. ఆసియా ప్రతినిధిగా ఇంట్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి గురువారం ఎన్నికయ్యారు.
Praveen Sinha కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా.. ఆసియా ప్రతినిధిగా ఇంట్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి గురువారం ఎన్నికయ్యారు. ఇంటర్పోల్లోని ఈ ఉన్నత ప్యానెల్లో రెండు స్థానాలు ఖాళీ అవడంతో..ఇస్తాంబుల్లో ఇంటర్పోల్ నిర్వహించిన 89 వ జనరల్ అసెంబ్లీలో భాగంగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆ స్థానాలకు చైనా, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జోర్డాన్ నుంచి ప్రవీణ్ సన్హాకు గట్టి పోటీ ఎదురైంది. చివరకు భారతీయ అభ్యర్థిగా ప్రవీణ్ విజయం సాధించారు.
ప్రపంచ దేశాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన కారణంగా ఈ విజయం దక్కినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలు, రాయబారులు, హై కమిషన్ల నుంచి ఈ ఎన్నికకు మద్దతు లభించినట్లు పేర్కొంది.
కాగా, ఇంటర్పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2022లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సిన్హా ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.
195 సభ్య దేశాలు గల ఇంటర్పోల్లో 1949లో భారత్ చేరింది. అంతర్జాతీయ నేరాలు, నేరస్థుల సమాచారాన్ని పంచుకోవడానికి సభ్య దేశాల్లోని పోలీసులకు ఇంటర్పోల్ సాయపడుతుంది. పాలకమండలి నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరానికోసారి ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశమవుతుంది. భారత్ 1997లో మాత్రమే ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది.
ALSO READ Navjot Sidhu : నిరాహార దీక్ష చేస్తా..చన్నీ ప్రభుత్వానికి సిద్ధూ హెచ్చరిక