ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేయనుంది. మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలోకి అక్రమంగా వీరంతా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ 161 మంది భారతీయులను అరెస్ట్ చేశారు. ప్రత్యేకమైన విమానం ద్వారా వీరిని పంజాబ్లోని అమృత్సర్కి పంపించనున్నారు.
అయితే అత్యధికంగా 76 మంది హర్యానా నుంచి వెళ్లారు. పంజాబ్ నుంచి 56 మంది, గుజరాత్ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, గోవా నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. హర్యానా నుంచి వెళ్లిన 19ఏళ్ల యువకుడు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
అమెరికా వ్యాప్తంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన మొత్తం 1739 మంది భారతీయుల్లో ప్రస్తుతం 95మంది జైళ్లలో మగ్గుతున్నారని నార్త్ అమెరికన్ పంజాబ్ ఆసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Satnam Singh Chahal తెలిపారు. 2018లో 611 మందిని అమెరికా నుంచి తిప్పి పంపించేసినట్టు చెప్పారు. 2019లో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి 1616కి చేరుకుందని తెలిపారు. మధ్యలోని ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి 35 నుంచి 50 లక్షలు తీసుకొని వారిని ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తారని చహల్ తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read : ఇకపై విమాన ప్రయాణం ఇలానే ఉండబోతోంది..?