Infosys Techie : కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి.. జపాన్లో వ్యవసాయంతో రెండింతలు సంపాదిస్తున్నాడు.. తమిళనాడు టెక్కీ సక్సెస్ స్టోరీ..!
Infosys Techie : కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశాడు.. వ్యవసాయమే తన వృత్తిగా భావించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నెల సంపాదన కన్నా రెండింతలు లాభాలను వ్యవసాయం ద్వారా సంపాదిస్తున్నాడు. అతడే తమిళనాడుకు చెందిన వెంకటసామి విఘ్నేస్..
Infosys Techie : ప్రస్తుత రోజుల్లో చాలామంది సొంత జీవోనాపాధిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఐదు అంకెల ఉద్యోగాన్ని కూడా వదిలేసి సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సొంత వ్యాపారాలను మొదలు పెట్టి అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. మరికొంతమంది తమకు ఆసక్తి ఉన్న రంగాలలో కూడా సొంతంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అనేక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీలను చాలావరకూ చూసే ఉంటాం.. ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..
చాలామంది తాము చేసే వృత్తిలో పెద్దగా సంతృప్తి ఉండదు. ఏదో ఒకటి సాధించాలనే తపన కనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తుల్లో తమిళనాడుకు చెందిన ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటసామి విఘ్నేస్.. చేసేది కార్పొరేట్ ఉద్యోగమైనా అతడిలో ఎలాంటి సంతృప్తి కలగలేదు. అందుకే.. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం మొదలుపెట్టాడు. జపాన్లో వంకాయల వ్యవసాయాన్ని చేపట్టాడు. ఇన్ఫోసిస్లో జీతం కన్నా ఇప్పుడు రెండింతలు సంపాదిస్తున్నాడు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. వెంకటసామి విఘ్నేష్ తమిళనాడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి. అతడికి వ్యవసాయంపై మక్కువ ఎక్కువగా ఉండేది. వెంకటసామి వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు.
తల్లిదండ్రులు వద్దన్నా వ్యవసాయంలోకి..
ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చినప్పుడు విఘ్నేష్ తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. అయితే, అతడు మాత్రం త్వరలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యవసాయంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో విఘ్నేష్ రైతుగా మారేందుకు.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నాడు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయం చేసే అవకాశం లభించిందని అన్నాడు. ఇంటికి వెళ్లినప్పుడల్లా పొలాలకు వెళ్లి పని చేస్తుండేవాడని మనీకంట్రోల్తో తెలిపాడు. అయితే, వ్యవసాయంలో పెద్దగా ఆదాయం ఉండదని, అతని కుటుంబం మొదట్లో ఒప్పుకోలేదు. స్థిరమైన ఆదాయం ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారని అతను చెప్పుకొచ్చాడు.
అయితే, 27 ఏళ్ల వెంకటసామికి జపాన్లో ఒక అవకాశం వచ్చింది. జపనీస్ భాష, సంస్కృతిలో శిక్షణను అందించే సంస్థ గురించి తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. ఈ సంస్థ ద్వారా దేశంలో మరికొంతమందికి ఉపాధిని కల్పించడంలో సాయపడింది. విఘ్నేష్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అతని ప్రయత్నాలు కూడా ఫలించాయి. ఆ సంస్థ పేరు నిహాన్ ఎడ్యుటెక్. ఆరు నెలల తర్వాత, విఘ్నేష్ జపాన్లో వంకాయల ఫారంలో వ్యవసాయ కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. ఇన్ఫోసిస్లో నెలకు రూ. 40వేల జీతం అందుకున్నాడు. కానీ, ఇప్పుడు అతడు నెలకు దాదాపు రూ. 80వేలు సంపాదిస్తున్నాడు. తాను కంపెనీ క్వార్టర్స్లో ఉచితంగా ఉంటున్నానని, కేవలం ఆహార అవసరాలు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందని విఘ్నేష్ తెలిపాడు.
కానీ, విఘ్నేష్ మాత్రం జపాన్లో శాశ్వతంగా ఉండాలని ప్లాన్ చేయలేదు. తన పని ముగిసిన తర్వాత.. ఇండియాకు తిరిగి రావాలనుకున్నాడు. జపాన్లో తన ఉద్యోగంలో నేర్చుకుంటున్న వినూత్న వ్యవసాయ పద్ధతులను స్వదేశంలో నేర్పిస్తానని అన్నాడు. కుటుంబం విషయానికొస్తే.. అతను ఇంతకుముందు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నందున తల్లిదండ్రులు కూడా తన నిర్ణయానికి ఓకే చెప్పారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత తన అనుభవాలను వారితో పంచుకోవాలని భావిస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తన విషయంలో గర్వపడుతున్నారని విఘ్నేష్ చెప్పాడు.