Redmi Smartphone : వీడియో చూస్తుండగా.. ఫోన్ పేలి 8 ఏళ్ల బాలిక మృతి.. అది రెడ్మీ ఫోన్ కాదా? కంపెనీ క్లారిటీ ఇదిగో..!
Redmi Smartphone : పేలిన ఫోన్ రెడ్మీ ఫోన్ అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, 8ఏళ్ల బాలిక ఏ ఫోన్ ఉపయోగించింది అనేదానిపై పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. నివేదికలపై స్పందించిన షావోమీ రెడ్మి కంపెనీ అసలు క్లారిటీ ఇచ్చింది.
Redmi Smartphone : మొబైల్ ఫోన్లతో జాగ్రత్త.. ఇటీవల చేతిలో ఫోన్లు ఒక్కసారిగా పేలిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టి వాడరాదు. ఇటీవల మొబైల్ ఫోన్లు పేలిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్న సమయంలో చేతిలో ఫోన్ పేలి 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని త్రిస్సూర్లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో బాలిక ఆదిత్యశ్రీ తన ఫోన్లో సినిమా చూస్తోంది. ఇప్పటికే స్థానిక పోలీసు అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందాన్ని కూడా నియమించారు. పేలిన ఫోన్ రెడ్మీ ఫోన్ అంటూ కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, 8ఏళ్ల బాలిక ఏ ఫోన్ ఉపయోగిస్తుందో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
పేలుడుకు రెడ్మి ఫోన్ కారణమా? ఇంకా నిర్థారణ కాలేదన్న కంపెనీ :
రెడ్మి అంటూ వస్తున్న ఆరోపణలపై షావోమీ సబ్ బ్రాండ్ (Redmi) పేరంట్ కంపెనీ (Xiaomi 91Mobiles)తో స్పందిస్తూ.. షావోమీ ఇండియా (Xiaomi India)లో, కస్టమర్ భద్రత చాలా ముఖ్యమైనది. ఇలాంటి విషయాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. సాధ్యమైనంత విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈ ఘటనకు రెడ్మి ఫోన్ పేలుడు కారణమని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి నిర్థారణ లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఫోన్ పేలుడుకు గల కారణాన్ని గుర్తించడానికి అధికారులతో కలిసి పని చేస్తున్నాం. దర్యాప్తుకు అవసరమైన విధంగా సహకరిస్తాం’ అని కంపెనీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
మొబైల్ పేలుడు కారణంగా వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్లోని బదువాన్లో ఓ బాలుడు తన మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్తో మృతిచెందాడు. మరో 68 ఏళ్ల వ్యక్తి తన ఫోన్కు ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలడంతో మృతిచెందాడు. ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఏ ఫోన్ను కూడా ఉపయోగించకూడదని నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఎందుకంటే.. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో డివైజ్ వేడెక్కడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. మీ ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు అది అదనపు వేడిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా డివైజ్ వెంటనే వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల బ్యాటరీ శాశ్వతంగా దెబ్బతింటుంది. అంతేకాదు.. బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ పేలడానికి లేదా మంటలకు కూడా దారితీస్తుంది.
ఛార్జింగ్లో ఉన్నప్పుడు మీ ఫోన్ని ఉపయోగించడం వల్ల విద్యుదాఘాతం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఫోన్ వేడెక్కడం వంటి సమస్యలు అంత సాధారణం కాదు. తడి ప్రదేశాలలో ఫోన్ను ఉపయోగించినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే, మీ ఫోన్ని ఛార్జర్కి ప్లగ్ చేసే ముందు మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్కార్ట్లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!