తెలంగాణలో భారీ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు మరింత బలపడి కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
కొంకణ్ & గోవా, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..ఛత్తీస్ఘడ్, మధ్య మహారాష్ట్ర మరియు తెలంగాణ, గుజరాత్ , ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.