UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత సంతతి నేత రిషికి ఎదురుదెబ్బ
'యూగోవ్' అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రిషి సునక్ కంటే లిజ్ ట్రస్కే టోరీ సభ్యులు అధికమంది మద్దతు తెలుపుతారని తేలింది. ఈ సర్వేలో భాగంగా 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్కే ఓటు వేస్తామని చెప్పారు. అలాగే, 38 శాతం మంది మాత్రమే రిషి సునాక్కు ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.
UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలుగుతుండడంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు నిర్వహిస్తున్న పోలింగ్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ అగ్రస్థానంలో నిలిచారు. అయితే, ఆయనకు ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ‘యూగోవ్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రిషి సునక్ కంటే లిజ్ ట్రస్కే టోరీ సభ్యులు అధికమంది మద్దతు తెలుపుతారని తేలింది.
ఈ సర్వేలో భాగంగా 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్కే ఓటు వేస్తామని చెప్పారు. అలాగే, 38 శాతం మంది మాత్రమే రిషి సునాక్కు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం చేసిన సర్వేలో లిజ్ ట్రస్కు 20 పాయింట్ల లీడ్ వస్తుందని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆయన మరింత పుంజుకుని 24 శాతం లీడ్కు చేరుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లు రిషి సునాక్కే భారీగా మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
ఐదో రౌండ్లోనూ రిషికి మద్దతుగా 137 మంది ఓట్లేసి అగ్రస్థానంలో నిలిపారు. ఆ రౌండ్లో లిజ్ ట్రాస్ 113 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరే పోటీలో నిలిచారు. తుది సమరంలో దాదాపు 1.80 లక్షల మంది కన్జర్వేటివ్ సభ్యులు పార్టీ అధినేతను ఎన్నుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న తుది ఫలితాలు తెలుస్తాయి. వచ్చే నెల 4 నుంచి సెప్టెంబరు ప్రారంభం వరకు ఓటింగ్ జరుగుతుంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎంతమందన్న విషయంపై స్పష్టత లేదు. అయితే, 2019లో పార్టీ నాయకత్వం కోసం జరిగిన ఎన్నికల ద్వారా 1.60 లక్షల మంది ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సంఖ్యే మరో 20 వేలు పెరిగినట్లు అంచనా.