బొద్దింకలను చంపబోయి మూడు కార్లను అంటించాడు

  • Published By: veegamteam ,Published On : November 10, 2019 / 04:09 PM IST
బొద్దింకలను చంపబోయి మూడు కార్లను అంటించాడు

గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు. ఆ సామెత ఈ ఘటనకు కచ్చితంగా సరిపోతుంది. ఆ ప్రబుద్ధుడు చేసిన పని పెద్ద ప్రమాదానికి దారి తీసింది. లక్షల రూపాయలు విలువ చేసే కార్లు కాలి బూడిదయ్యాయి. ఇంతకీ ఆయన ఏం చేయాలని అనుకున్నాడో తెలుసా.. బొద్దింకలను చంపాలని అనుకున్నాడు. అది కాస్తా సీన్ రివర్స్ అయ్యి ఇంకేదో జరిగిపోయింది.

వివరాల్లోకి వెళితే బొద్దింకలను చంపబోయి మూడు కార్లను అంటించాడు ఓ వ్యక్తి. తన వంట గదిలో ఉన్న బొద్దింకలను చంపేందుకు స్ర్పే చేశాడు. ఆ తర్వాత దానికి నిప్పు పెట్టాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రోడ్డు మీదకు వ్యాపించాయి. 

రోడ్డు పార్క్ చేసిన 3 కార్లు తగలబడ్డాయి. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన చైనాలో జరిగింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ప్రబుద్ధుడి నిర్వాకానికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని నెటిజన్లు అంటున్నారు. వీడెవడండి బాబూ అని నిట్టూరుస్తున్నారు. అతడు చేసిన పని తెలుసుకుని కొందరు షాక్ తిన్నారు. ఊహించని విధంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘోరం జరిగిపోయింది. అయితే ఆ సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని తలుచుకుని కంగారుపడ్డారు.

ఈ ఘటనతో ఆ వ్యక్తి కూడా కంగుతిన్నాడు. కాసేపు షాక్ లో ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. అయ్యో.. ఎంత పని జరిగిందని చింతించాడు.